20, జులై 2012, శుక్రవారం

తైమూరు ముచ్చట్లు: పాత ప్రధాని నేతృత్వంలో కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వం





ఈ నెల మొదటి వారంలో పార్లమెంటు ఎన్నికలు జరుపుకున్న తూర్పు తైమూర్ దేశం కొత్త సంకీర్ణప్రభుత్వం ఆధ్వర్యంలో తన భవిష్యత్తును నిర్మించుకోనున్నది. పది సంవత్సరాల క్రితం విదేశీ ఇండోనేషియా నియంతృత్వ పాలన నుండి విముక్తి చెంది, ఇన్నాళ్ళూ ఐక్యరాజ్య సమితి చిటికెనవేలు పట్టుకోని నడిచిన తైమూరు ఇక స్వయంగా తన పయనం కొనసాగించనుంది. నాలుగు వందల సంవత్సరాల పోర్చుగీసు వలస పాలన నుండి, ఆ తర్వాత పాతిక సంవత్సరాల ఇండోనేషియా నియంతృత్వ పాలన నుండి బయట పడడానికి తైమూరు ప్రజలు ఎన్నో త్యాగాలు చేసారు, దాదాపు దేశ జనాభాలో మూడవవంతు       (సుమారు మూడులక్షల మంది) బలి  పీఠం ఎక్కిన తర్వాతగాని స్వాతంత్ర్యానికి నోచుకోలేదు. బంగారు పిచ్చుక లాంటి భారతదేశాన్ని కూడ పీల్చిపిప్పి చేసిన విదేశీ వలసపాలన చిన్న ద్వీప దేశమైన తైమూరుకు ఎలాంటి మినహాయింపు ఇవ్వలేదు. తత్ఫలితం ప్రపంచంలో మానవ అభివృద్ది నివేదిక ప్రకారం 146 వ స్థానం. పేరుకు 12 లక్షల జనాభా కలిగిన చిన్న దేశమే కాని కళ్ళ ముందు సవాలక్ష సమస్యలు దర్శనమిస్తున్నాయి. పేదరికం, నిరక్షరాస్యత, మౌలిక వసతుల కొరత, ఆందోళన పరుస్తున్న ప్రజల ఆరోగ్యం, ఇంకా  వంటబట్టని ప్రజాస్వామ్య స్పూర్తి ... ఇవన్ని కొత్త ప్రభుత్వం ముందున్న ముఖ్యమైన సవాళ్ళు.

 దామాషా ప్రాతినిథ్యం పద్దతి ప్రకారం ఎన్నికలు జరుపుకున్న ఈ దేశ పార్లమెంటు లో మొత్తం 65 సీట్లు ఉన్నాయి. ఎన్నికలలో పార్టీలు సాధించిన ఓట్లను బట్టి సీట్లు కేటాయిస్తారు.  సార్వజనిన వయోజన ఓటింగును అవలంభిస్తున్న ఇక్కడ 17 సంవత్సరాలు దాటిన వయోజనులకు ఓటు హక్కు కల్పించారు.ప్రశాంత వాతావరణంలో, అంతర్జాతీయపర్యవేక్షణలో జరిగిన ఎన్నికలలో మొత్తం 6,47,814 మంది ఓటర్లు  21 పార్టీలకు ఓటు వేశారు. కాసుల పంపకాలు, మందు చుక్కలు, మైకుల హోరు, ఫ్లెక్సీల జోరు, విందు భోజనాల హంగామా, హాడావిడి లేని ఎన్నికలివి, ఒక దశలో నాకే అనుమానం వచ్చింది.." అసలు నిజంగానే  ఎన్నికలు జరుగుతున్నాయాని". పోలింగ్ రోజు డ్యూటీ కి వెళ్ళడంతో సందేహాం తీరిపోయింది. మనలాగా ఎలక్ట్రానిక్ ఓటింగు యంత్రాలు లేవిక్కడ..సాంప్రదాయపద్దతిలో 21 పార్టీల గుర్తులున్న బ్యాలెట్ పేపరు వాడారు. అయితే నవ్వోచ్చే విషయం ఏమిటంటే ఓటర్లు బ్యాలెట్ పేపర్ పై  తమకు నచ్చిన, మెచ్చిన పార్టీ గుర్తుపై మేకుతో బొక్క పొడిచి, బాక్సులో వేస్తారు. ఆ తర్వాత మూడుగంటలనుండి అదే సెంటరు లో ప్రారంభం అయ్యే కౌంటింగ్ లో ప్రిసైండింగ్ అధికారి బహిరంగంగా ఒక్కో బ్యాలెట్ పేపర్ ను బయటికి తీసి, ఓక్కొ బొక్కను లెక్కపెడుతు, బోర్డుపై పార్టీలు సాధించిన బొక్కల లెక్కలు రాస్తాడు.తర్వాత బ్యాలెట్ బాక్సులన్నీ దేశరాజధానికి చేరుకుంటాయి..అక్కడ ట్యాబులేషన్ పని  జరుగుతుంది. తైమూరు రాజ్యాంగం ప్రకారం ఎన్నికలు జరిగిన 12 రోజులకు ఎన్నికల ఫలితాలు అధికారికంగా ప్రకటించాలి.


ప్రస్తుత ప్రధాని జనానా గుసామా
ఈ ఎన్నికలలో 21 పార్టీలు పాల్గొన్నాకూడ కేవలం నాలుగు పార్టీలు మాత్రమే సీట్లు సాధించే ఓట్లు సంపాదించుకున్నాయి. ప్రస్తుత ప్రధాని జనాన గుసామా నేతృత్వంలోని CNRT పార్టీ అధికంగా ౩౦ సీట్లు సంపాదించంగా, స్వాతంత్రపోరాటంలో అగ్రగామి గా నిలిచిన FRETLIN పార్టీ 25సీట్లు, మాజీ అధ్యక్షుడు, నోబెల్ బహుమతి గ్రహీత అయిన రామోస్ హోర్తా మద్దతుగల PD పార్టీ 8 సీట్లు, మరో చిన్న పార్టీ 2 సీట్లు సంపాదించుకున్నాయి. మన కాంగ్రేస్ పార్టీ లాగా స్వాతంత్ర్య ఉద్యమంలో ముందునిలిచిన FRETLIN పార్టీకి ఈసారి కూడా తీవ్ర నిరాశ ఎదురయ్యింది.ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 65 సీట్ల పార్లమెంట్ లో 33 సీట్లు ఉండాలి, ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యత లేనందున సంకీర్ణ ప్రభ్హుత్వ ఏర్పాటు తప్పనిసరి అయింది. FRETLIN పార్టీ మీనమేషాలు లెక్కపెడుతుండగానే, ప్రధాని జనానా నేతృత్వంలోని CNRT పార్టీ ఇతర రెండు పార్టీలతో కలిసి, సంకీర్ణం ఏర్పాటుకు రంగం సిద్దం చేసింది. సైన్యంలో అత్యధికంగా మద్దతు గల FRETLIN పార్టీ నిరసన దేశంలో ఆందోళనలకు,అల్లర్లకు దారి తీసింది. ప్రస్తుతానికి తాత్కలికంగా అల్లర్లు ఆగినా, ఎప్పుడైనా తిరిగి చెలరేగడానికి అవకాశం ఉంది.దేశంలో శాంతి భద్రతల పర్యవేక్షణ చేస్తున్న 1300 వందల మంది ఐరాస శాంతి పరిరక్షక బృందం (అంటే మేము), కొత్త ప్రభుత్వానికి బరువు, బాధ్యతలు అప్పగించి ఈ సంవత్సరాంతానికి ఇక్కడి నుండి బయటపడడానికి  రంగం సిద్దం అవుతున్నది. ఐరాస శాంతి పరిరక్షక బృందం వెళ్ళిపోయిన తర్వాత అసలు సవాలు ప్రారంభం అవుతది, పరిణితి చెందని ప్రజాస్వామ్యం, సైన్యం పొషించనున్న పాత్ర అనేవిక్కడ రెండు కీలకమైన అంశాలు, ఏమాత్రం తేడా వచ్చినా కథ మళ్ళీ మొదటికే వస్తుంది.


మాజీ అధ్యక్షుడు, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత రామోస్ హోర్తా
అంతగా వ్యవసాయయోగ్యంగా లేని ఈ దేశం ప్రధానంగా దేశ సముద్ర జలాల్లో విస్తారంగా ఉన్న చమురు నిల్వల పైనే ఆధారపడుతున్నది, దేశ బడ్జెట్లో సుమారు 90 శాతం ఆదాయాన్ని చమురు రంగం భర్తీ చేస్తున్నది. ఈ ఆదాయాన్ని ప్రధానంగా దేశాభివృద్దికి వినియోగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది, ఇండోనేషియా వెళ్తూ, వెళ్తూ అంతంత మాత్రమే ఉన్న మౌలిక వసతులను సర్వనాశనం చేసి వెళ్ళింది. ముఖ్యంగా ఈ దేశ రహాదారులు అక్షరాలా నరకానికి నకళ్ళు అని చెప్పవచ్చు. కొండలూ, గుట్టలు లతో కూడిన పాము మెలికల రోడ్లు, విరిగిపడే కొండ చరియలు, జర్రున జార్చుకొనే లోయలు...అబ్బో వర్ణించలేము ఆ సౌందర్యాన్ని, ప్రయాణం చేస్తుంటే కాళ్ళూ చేతులు చలిజ్వరం వచ్చినట్లు వణుకుతుంటాయి..ఇక చదువు, కమ్యూనికేషన్ వ్యవస్థలు ఇంకా వ్యవస్థాగతం కాలేదు. విద్య, రవాణా సౌకర్యాల కొరత వల్ల మానవవనరులు ఒకే చోట స్తిరపడిపోయాయి, పని లేక ఖాళీ గా ఉన్న యువత ( ప్రధానంగా గ్రామీణ యువత) సోమరిపోతుల్లాగా తయారు అవుతున్నారు, సిగరెట్ల పొగల మధ్య, బిలియర్డ్స్, కోళ్ళ పందాలతో టైంపాస్ చేస్తున్నారు..అయితే వీళ్ళు ఒక విషయంలో మాత్రం బాగానే కష్టపడుతున్నారు...అదే కష్టపడి ఎడా,పెడా పిల్లలను కనడం. ఈ దేశంలో అభివృద్దిలేమికి తోడు ఆందోళన పరిచేరీతిలో అవినీతి మరో పక్క వేధిస్తున్నది. ఏతావాతా అన్నీ సమస్యలే, ఈ సమస్యలను దాటి అభివృద్ది వైపు దేశం పరుగెత్తాలంటే కావాల్సిందల్లా నిబద్దత కలిగి నాయకత్వం. స్వాతంత్ర్యపోరాటంలో దేశ ప్రజలకు స్పూర్తినిచ్చి, ముందుండి ఉద్యమాన్ని నడిపిన జనాన గుసామా, రామోస్ హోర్తా లాంటి స్పూర్తిదాయక నాయకులే ప్రస్తుతం ఏర్పడబోతున్న ప్రభుత్వంలో భాగస్వామ్యులు... దేశ స్వాతంత్ర్యపోరాటం కంటే కూడా  అభివృద్ది వైపు దేశాన్ని నడిపించడం వీరికి మరింత సంక్లిష్టమైనది. ఈ బృహత్ప్రయత్నంలో తైమూరు నూతన నాయకత్వం సఫలం అయి, ప్రపంచదేశాలు "ఔరా" అని అనేంతగా, ఆదర్శకరమైన అభివృద్ది సాధించాలని అందరం ఆశిద్దాం..


                                                            జై తైమూర్....జై జై తైమూర్!!
బ్యాలెట్ బాక్సులు తరలిస్తున్న ఐలు జిల్లా ఐరాస అధికారి, స్తానిక పొలీసు అధికారి
నేను ఓటేసా!
ఓటు వేయడానికి గుర్రమెక్కి వస్తున్న తైమూరు తాత


ఎన్నికల విధులలో "నేను" అంటే నరేందర్ జవ్వాజి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి