22, మే 2022, ఆదివారం

శప్తభూమి


                                                            
                                                             శప్తభూమి
..చాలా రోజుల తర్వాత, పూర్తి అయ్యేదాకా వదలబుద్ది కాకుండా చదివిన పుస్తకం ఇది.. 18 వ శతాబ్దిలో రాయలసీమ  ముఖ్యంగా అనంతపురం ప్రాంతంలో నెలకొన్న సామాజిక,ఆర్థిక,రాజకీయ, సాంస్కృతిక పరిస్థితులను సీమ రచయిత బండి నారాయణస్వామి అద్భుతంగా ఆవిష్కరించిన ఈ  చారిత్రక నవల,   మనల్ని ఆసాంతం ఆకట్టుకుంటుంది.2017 లో తానా వారి ఉత్తమనవల గానే కాక కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన ఉత్తమ రచన ఇది. ఒక గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే కలిగిన సినిమా చూస్తున్నపుడు మధ్యలో  ఇంటర్వెల్ కూడా ఇరిటేటింగా అనిపిస్తుంది,  ఈ నవల చదువుతుంటే నాక్కూడ సేమ్ టు సేమ్ ఆదే ఫీలింగ్ కలిగింది, ఏ కొద్ది సమయం దొరికినా చాలు ఒకటి రెండు  పేజీలు అయినా సరే తిప్పెయాలనిపించేది ..

                                         ఈ నవల అంతగా నన్ను ఆకట్టుకోవడానికి ప్రధానంగా నేను చరిత్ర విద్యార్థిని కావడం ఒక కారణమైతే , ఆయా పాత్రల చిత్రీకరణ , వాటిని రచయిత నడిపించిన తీరు, ఆ నాటి సామాజిక పరిస్థితులను, మూఢ నమ్మకాలను, విశ్వాసాలను, ఆచార వ్యవహారాలను కళ్ళకు కట్టినట్లు వివరించడం..అత్యద్భుతం.. నాకు దాశరథి రంగాచార్య రచనలు అంటే చాలా ఇష్టం, ఆయన జీవనయానం, మోదుగుపూలు...నాపై చాలా ప్రభావం చూపాయి. ఒక సినిమా చూసినా కానీ, ఒక పుస్తకం చదివినా కానీ, ఆ తర్వాత కూడా ఆ సినిమా , ఆ పుస్తకంలోని పాత్రలు, సన్నివేశాలు కొన్ని రోజుల పాటు మనల్ని వెంటాడుతున్నాయి అంటే అది చాలా  ప్రభావవంతమైన సినిమా/పుస్తకం అనవచ్చు.. ఈ నవల లోని  ఎల్లప్ప జెట్టి, పద్మసాని,కంబళి శరభుడు, హండే రాజు, కోడె నీలడు, ఇమ్మడమ్మ,హరియక్క లాంటి సజీవ పాత్రలు కొంతకాలం పాటు మనల్ని వెంటాడుతాయి..

                               ఈ  రచయిత చెప్పినట్లు ఈ నవల కేవలం ఆ నాటి రాయలసీమ చరిత్రనే కాదు, ఆనాటి దళిత బహుజనుల దైన్య జీవితాలను, పాలెగార్ల ఆరాచకాలను, పైవాల్లకు కప్పాలు చెల్లించడం కోసం   ప్రజలను  దొంగల్లా దోపిడీలు చేసే పాలకులను, భర్త చనిపోతే బలవంతంగా భార్యను చితి ఎక్కించే సతీసహగమనాలు, అగ్రవర్ణాల, పాలకుల కామవాంఛలు తీర్చడం కోసం ఏర్పాటు చేసిన దేవదాసి, బసివిని వ్యవస్థలు, బలహీనవర్గాల పై పాలకులు చేసే లైంగిక దోపిడీలు, సమాజంలో బలంగా నాటుక పోయిన కుల విషవృక్ష పు వికృత ఊడలు, గునిగానప్ప పరసలో  పెళ్లయిన కొత్త దళిత జంటలు గుండుకొట్టించుకొని సున్నం బోట్లు పెట్టుకోవాలని లేకపోతే అరిష్టమనుకోనే  మూడనమ్మకాలు, కరువు కాటకాలతో సతమతం అవుతున్న  సమాజం , వానాల కోసం చేసే ఉత్సవాలు, దేవుడి కోసం గండ కత్తెరతో అంగాంగం కట్టిరించుకుంటూ దేహత్యాగం చేసుకొనే వీర మంటపం లాంటి విశ్వాసాలు ...ఇలా చాలా చాలా విషయాలు ఉన్నాయిందులో.. నవల చదవడం ప్రారంభించినప్పుడు too many characters , facts and incidents అనిపించింది, కానీ ఒకసారి ట్రాక్ లో పడిన తర్వాత ఆ మజానే వేరు..ఇప్పటికే ఇంత మంచి నవల చదవడం ఆలస్యం అయ్యింది, మీరు కూడా చదవండి..సాహితీ లోకానికి మంచి రచనను అందించిన రచయిత Bandi Narayana Swamy  గారికి ధన్యవాదాలతో 🙏